Indian Woman Anju And Her Pakistani Facebook Lover Nasrullah Reacts About Marriage Rumours - Sakshi
Sakshi News home page

Anju And Nasrullah Marriage Rumours: మతం మారలేదు.. మేం పెళ్లి చేసుకోలేదు.. నేనింకా భారతీయురాలినే!

Published Wed, Jul 26 2023 7:44 AM

Indian woman Anju and her Pakistani lover About Marriage - Sakshi

ఓవైపు పాక్‌ మహిళ సీమ వ్యవహారం వార్తల్లో ఉండగానే..  ఫేస్‌బుక్‌ స్నేహితుడు(ప్రియుడి!) కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్‌ వెళ్లిన రాజస్థానీ వివాహిత అంజు ఎపిసోడ్‌కు విపరీతమైన హైప్‌ వచ్చింది. ఈలోపు ఈ ప్రేమకథా చిత్రమ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మతం మార్చుకుని ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను వివాహం చేసుకుందని.. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు, వివాహ సర్టిఫికెట్‌ కూడా వైరల్‌ అయ్యాయి. అయితే.. భారత్‌కు చెందిన ఓ జాతీయ ఛానెల్‌ అంజు-నస్రుల్లాను విడివిడిగా సంప్రదించగా.. మీడియాలో వస్తున్న కథనాలన్నింటిని, తమకు వివాహం జరిగిందన్న ప్రచారాన్ని ఇద్దరూ కొట్టేశారు. 


నస్రూల్లా ఏమన్నాడంటే..  నేను అంజుని పెళ్లి చేసుకోలేదు. మా పేరుతో వైరల్‌ అవుతున్న సర్టిఫికెట్‌ కూడా ఫేక్‌. అన్నీ పుకార్లే. ఆమె కేవలం నాకు మంచి స్నేహితురాలే.   మా ఇద్దరి గురించి మీడియాలో రావడంతో భద్రత కోసమే కోర్టుకు వెళ్లాం. ఇక్కడ బుర్ఖా సంప్రదాయం కాబట్టి ఆమె ధరించింది అంతే.  అంజూ విదేశీయురాలు. పైగా భారతీయురాలు. ఆమెకు ముప్పు పొంచి ఉండడం సహజం.  గనుక.. ప్రభుత్వం కూడా మాకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. 50 మంది పోలీసులు మాకు భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మేం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.

ఆమె ఇంకా హిందువుగానే ఉంది. టూరిస్ట్‌ వీసా మీద పాక్‌ను చూడడానికి వచ్చింది. భర్తతో ఆమెకు గొడవలు వచ్చాయని.. విడాకుల ప్రక్రియ నడుస్తోందని నాకూ తెలుసు. విడాకులు మంజూరు అయ్యాక నన్ను ఇష్టపడితే ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటా. కానీ, అది ఆమె నిర్ణయం. ఇప్పటికైతే.. ఆగష్టు 4 వీసా గడువు ముగిశాక ఆమె తిరిగి భారత్‌కు వెళ్లిపోతుంది.

అంజూ ఏమందంటే.. 
పాక్‌కు వెళ్లాలనుకున్నాను.. వెళ్లాను. నేనేం మతం మారలేదు. ఎవరినీ వివాహం చేసుకోలేదు. ఇక్కడ ఓ ఫేమస్‌ వ్లోగర్‌ మా ఇద్దరినీ కలిపి షూట్‌ చేశాడు. అంతేగానీ.. అదేం ప్రీ వెడ్‌ షూట్‌ లేదంటే పోస్ట్‌ వెడ్‌ షూట్‌ కాదు. అంతా పుకార్లే. నేను నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమే. నేనింకా భారతీయురాలినే. భారత్‌కు తిరిగొచ్చాక.. నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటా అని పేర్కొందామె. 


అక్కడే చచ్చిదనుకంటాం
అంజూ(34) ఇంటి నుంచి వెళ్లిపోయి మరీ మతం.. ఫాతిమాగా పేరు మార్చేసుకుని పాకిస్తాన్‌ ఖైబర్‌ ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నస్రుల్లా(29)ను వివాహం చేసుకుందంటూ పాక్‌ నుంచి కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలియగానే.. ఆమె తండ్రి  కన్నీటి పర్యంతం అయ్యారు. స్వస్థలం మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ బౌనా గ్రామం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన .. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఇద్దరు పిల్లలు, భర్త గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.  కనీసం బిడ్డల గురించి కూడా ఆలోచించలేదు. తన ఇష్టం, తన జీవితం తనది కావొచ్చు. కానీ, ఇలా చేయాలనుకుంటే.. ముందు భర్తకు విడాకులు ఇవ్వాలి కదా. కానీ, ఇలా పరువు తక్కువ పని చేయకూడదు కదా.  అన్ని బంధాలను తెంచుకున్న అంజూ ఇక మా దృష్టిలో చచ్చినట్లే అని అంజు తండ్రి గయా ప్రసాద్‌ థామస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మానసిక స్థితి సరిగ్గా లేదని, తిరిగొస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ అంతకు ముందు వ్యాఖ్యానించిన ఆయన.. కూతురి నిఖా చేసుకుందనే వార్త తెలిసే సరికి దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరిగి ఆమెను భారత్‌కు రప్పించే ప్రయత్నం చేస్తారా?.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అంటే.. అలాంటి ప్రయత్నమేమీ చేయబోమని తెలిపారాయన. చస్తే అక్కడే చావనివ్వండి.. తన ఇద్దరి పిల్లలను మేం చూసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.   

ఇదీ చదవండి: ఆకాశంలో వింత.. స్వర్గానికి దారి ఇదేనా?

Advertisement
Advertisement