భారత ఆర్థిక డీఎన్‌ఏ మారింది: మస్కట్‌లో ప్రధాని మోదీ | India has changed its economic DNA PM Modi | Sakshi
Sakshi News home page

భారత ఆర్థిక డీఎన్‌ఏ మారింది: మస్కట్‌లో ప్రధాని మోదీ

Dec 18 2025 1:03 PM | Updated on Dec 18 2025 2:52 PM

India has changed its economic DNA PM Modi

మస్కట్: గడచిన 11 ఏళ్ల కాలంలో భారత్ తన విధివిధానాలను మార్చుకోవడమే కాకుండా, తన దేశ ఆర్థిక డీఎన్‌ఏనే సమూలంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా గురువారం మస్కట్‌లో నిర్వహించిన ‘ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. భారతదేశం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు నేడు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్‌లలో ఒకటిగా నిలిపాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కుదురుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) 21వ శతాబ్దపు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను, వేగాన్ని ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడిన కీలక సంస్కరణలను ప్రస్తావిస్తూ, జీఎస్టీ (GST) అమలు ద్వారా భారతదేశం ఒకే సమీకృత మార్కెట్‌గా ఆవిర్భవించిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) వంటి నిర్ణయాలు దేశంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచి, పారదర్శకతను పెంపొందించాయని వివరించారు. ఈ చర్యల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల నమ్మకం రెట్టింపు అయిందని, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశాయని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలతో జరిగిన ఈ సమావేశంలో భారత ఆర్థిక ప్రగతి పథాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
 

భారత్-ఒమన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా సముద్రం రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారధి అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వీకుల కాలం నుంచే సముద్ర వాణిజ్యంలో ఇరు దేశాలు సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్నేహం  ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మోదీ ఆకాంక్షించారు.

ఇరు దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జోర్డాన్, ఇథియోపియా పర్యటనలను ముగించుకుని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ఒమన్ చేరుకున్న ప్రధాని, రెండు రోజుల పాటు ఇక్కడ వివిధ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వాణిజ్య రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడం, భవిష్యత్ ప్రణాళికల కోసం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్‌ సుతార్‌ కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement