నిరసనల ఎఫెక్ట్‌.. నేపాల్‌ మాజీ ప్రధాని ఓలీ కీలక ప్రకటన | Former Nepal PM KP Sharma Oli Denies Fleeing Country | Sakshi
Sakshi News home page

నిరసనల ఎఫెక్ట్‌.. నేపాల్‌ మాజీ ప్రధాని ఓలీ కీలక ప్రకటన

Sep 29 2025 11:45 AM | Updated on Sep 29 2025 12:01 PM

Former Nepal PM KP Sharma Oli Denies Fleeing Country

ఖాట్మాండ్‌: నేపాల్‌(Nepal) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) కీలక ప్రకటన చేశారు. తాను దేశం వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.

నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తాజాగా మాట్లాడుతూ.. నేను ఎవరికీ భయపడను. దేశంలోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తాను. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్‌ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి తాను పారిపోతానని అనుకుంటున్నారా? అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇదే సమయంలో  ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా.. విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికి కూడా తనకు బెదిరింపు మెసేజులు వస్తున్నాయన్నారు. నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేపాల్‌లో అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా ఇటీవల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా జెన్‌-జీ(Gen Z) ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement