చైనాపై మరో 50% | Donald Trump new 50 Percent tariffs on China | Sakshi
Sakshi News home page

చైనాపై మరో 50%

Apr 9 2025 4:10 AM | Updated on Apr 9 2025 4:10 AM

Donald Trump new 50 Percent tariffs on China

అన్నంత పనీ చేసిన ట్రంప్‌

డెడ్‌లైన్‌ ముగుస్తూనే బాదుడు

మొత్తం సుంకాలు 104 శాతం 

నేటినుంచే అమల్లోకి: వైట్‌హౌస్‌ 

అంతకంతా ప్రతీకారం: చైనా

బీజింగ్‌/వాషింగ్టన్‌: ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్‌ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. 

మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్‌ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. 

కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.  

ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం 
బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్‌ కమిషన్‌ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్‌ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

భారత్‌పైనా నేటినుంచే!
ప్రపంచ దేశాలపై ట్రంప్‌ ఇటీవల విధించిన టారిఫ్‌ల అమలులో ఆలస్యం, డెడ్‌లైన్‌ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్‌ కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్‌ 2న ట్రంప్‌ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్‌ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్‌పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్‌ టారిఫ్‌లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్‌ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement