కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

COVID19 Was Man Made Virus That Leaked Wuhan Lab - Sakshi

కరోనా పుట్టినిల్లు చైనా అంటూ అంతా డ్రాగన్‌ దేశాన్ని ఆడిపోసుకున్నారు. కానీ అసలు కారణం అగ్రరాజ్యం అని యూఎస్‌కి చెందిన ఒక పరిశోధకుడు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు. చైనాలోని ప్రుభుత్వ నిధులతో నిర్వహిస్తున్న వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పరిశోధన కేంద్రం నుంచే కరోనా వైరస్‌ లీకైందని పేర్కొంది కూడా ఈ శాస్త్రవేత్తే. ఈ మేరకు యూఎస్‌ పరిశోధకుడు ఆండ్రూ హఫ్‌ తాను రాసిన 'దిట్రూత్‌ అబౌట్‌ వ్యూహాన్‌' అనే పుస్తకంలో ఈ విషయాల గురించి వెల్లడించాడు.

చైనాలో రిసెర్చ్‌ సెంటర్‌లోని కరోనా వైరస్‌ పరిశోధనలకు యూఎస్‌ ప్రభుత్వమే నిధులందిస్తోందని చెప్పారు. ఐతే చైనా ల్యాబ్‌లో పరిశోధనలకు తగినంత భద్రత లేకపోవడంతోనే ఈ వైరస్‌ లీక్‌ అయినట్లు తెలిపారు. ఇది మానవ నిర్మిత వైరస్‌ అని తేల్చి చెప్పారు. ఈ పరిశోధనలు అత్యంత రిస్క్‌తో కూడినవని, వీటికి సరైన భద్రత తోపాటు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే  నియంత్రించ గలిగేలా ల్యాబ్‌లో తగినంత కట్టుదిట్టమైన చర్యలు లేవన్నారు. అంతేగాదు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) అనేది అమెరికా ప్రభుత్వం ప్రాథమిక ఏజెన్సీ.

ఈ ఎన్‌ఐహెచ్‌ అంటువ్యాధులపై అధ్యయనం చేసే లాభప్రేక్ష లేని ఎకోహెల్త్ అలియన్స్ అనే సంస్థకు గబ్బిలాలతో వివిధ కరోనా వైరస్‌లపై అధ్యయనం చేసేందుకు దశాబ్దాలకుపైగా  నిధులు సమకూర్చిందని చెప్పారు. పైగా ఈ సంస్థ వ్యూహాన్‌ ల్యాబ్‌తో టైఅప్‌ అయ్యి ఈ కరోనా వైరస్‌పై మరింతగా పరిశోధనలు చేసిందని, ఫలితంగానే ఈ వైరస్‌ లీక్‌ అయ్యిందని చెప్పారు. శాస్త్రవేత్త హాఫ్‌ 2014 నుంచి 2016 వరకు ఈ ఎకోహెల్త్‌ అలియన్స్‌ సంస్థ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎకోహెల్త్‌ సంస్థ ఈ కరోనా వైరస్‌ను సృష్టించే పరిశోధన పద్ధతులను మరింతగా అభివృద్ధి చేయడంలో వ్యూహాన్‌ ల్యాబ్‌కు సాయం చేసినట్లు తెలిపారు.

ఇది జన్యు పరంగా సృష్టించిన వైరస్‌ అని చైనాకు ముందు నుంచే తెలుసునని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రమాదకరమైన బయోటెక్నాలజీ చైనాకు అందించింది యూఎస్‌ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చైనా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ పరిశోధనలకు నిలయంగా మారింది. ఐతే వ్యూహాన్‌ పరిశోధన సంస్థకు వనరుల కొరత ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయిని పెంచుకునేలా అధికస్థాయిలో శాస్త్రీయ పరిశోధనలు జరగాలంటూ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ విపరీతమైన ఒత్తిడిని తీసుకొచ్చినట్లు శాస్త్రవేత్త హాఫ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.
(చదవండి: చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top