Bangladesh: షేక్‌ హసీనా తండ్రి విషయంలోనూ.. | Bangladesh First Military Coup in 1975 | Sakshi
Sakshi News home page

Bangladesh: షేక్‌ హసీనా తండ్రి విషయంలోనూ..

Aug 6 2024 1:48 PM | Updated on Aug 6 2024 1:50 PM

Bangladesh First Military Coup in 1975

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడి సైన్యం ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపధ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.

బంగ్లాదేశ్‌లో ఈ విధమైన తిరుగుబాటు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 1975లో కూడా ఇదేవిధంగా జరిగింది. నాటి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా తండ్రి, ఆమె సోదరులు హతమయ్యారు. అయితే షేక్ హసీనా ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె బంగ్లాదేశ్‌కు దూరంగా ఇతర దేశాలలో సుమారు ఆరేళ్ల పాటు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె  భారతదేశంలో కూడా చాలా కాలంపాటు ఉన్నారు.

అది 1975వ సంవత్సరం.. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆర్మీ యూనిట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది.  కొంతమంది సాయుధులు షేక్ హసీనా ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిదండ్రులను, సోదరులను దారుణంగా హత్యచేశారు. అయితే ఆ సమయంలో షేక్ హసీనా తన భర్త వాజిద్ మియాన్, చెల్లెలు పాటు యూరప్‌లో ఉన్నందున ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు.

ఈ ఘటన అనంతరం షేక్ హసీనా కొంతకాలం జర్మనీలో ఉండి భారత్‌కు వచ్చారు. నాడు భారతదేశంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. షేక్‌ హసీనా 1981లో బంగ్లాదేశ్‌కు తిరిగి చేరుకున్నారు. ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన సమయంలో ఆమెకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. దీని తరువాత షేక్ హసీనా 1986 సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే 1996 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె 2001 వరకూ ప్రధాని పదవి చేపట్టారు. అలాగే 2009 నుంచి 2004 వరకూ కూడా షేక్‌ హసీనా ప్రధాని పదవిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement