ఒకవైపు ఉన్నత వర్గాలు.. మరోవైపు పేదలు
సాక్షి, సిటీబ్యూరో
నగరం విభిన్న అంశాల సమాహారం. ఏ రంగంలో చూసినా, ఏ అంశంలో చూసినా ఈ విషయమే తేటతెల్లమవుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ‘సోషియో– ఎకనమిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే–2024’ సైతం ఇదే అంశాన్ని వెల్లడించింది. నగరంలోని అసమానతలు, ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవని స్పష్టం చేసింది. సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కులాలు, ఆదాయ స్థాయి, నివాస సదుపాయాల విషయంలో స్పష్టమైన అసమానతలు ఉన్నట్టు బయటపడింది. ఒకవైపు అధిక ఆదాయ వర్గాలు, మరోవైపు మౌలిక వసతుల కోసం పోరాడే వర్గాలున్న నగర భిన్న రూపం వెల్లడైంది. సర్వే మేరకు పట్టణ గృహాలు 20,17,409. బీసీల్లో ముస్లిం మైనార్టీలను, మైనార్టీయేతరుల వారీగానూ వివరాలు పొందుపర్చారు. ఎస్సీల గృహాలు 2,19,587, ఎస్టీల గృహాలు 55,017, ముస్లిం మైనార్టీలో బీసీల గృహాలు 3,65,578 ఉన్నాయి.
కులాల వారీగా విభజన
కులాల వారీగా చూస్తే బీసీలే అధికం. గృహాల పరంగా చూస్తే బీసీలు గృహాలు దాదాపు 29.58% ఉండగా, ఓసీ వర్గాలవి 38.68% ఉన్నాయి. ముస్లిం మైనారిటీలవి 25.40% వాటా కలిగి ఉండటం నగర ప్రత్యేకతను చూపుతోంది. ఎస్సీలు, ఎస్టీల గృహాలు వీరికంటే తక్కుగా ఉన్నాయి. కొన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లలో నివసిస్తుండగా, మరికొన్ని వర్గాలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నాయి. ఉన్నత వర్గాల్లో ఎక్కువ గదులతో విశాలమైన ఇళ్లు కనిపిస్తుండగా.. వెనుకబడిన వర్గాల్లో ఒకటి లేదా రెండు గదుల ఇళ్లలోనే జీవిస్తున్నాయి.
పిల్లలు తక్కువే..
0–5 ఏళ్ల చిన్నారులు జీహెచ్ఎంసీ జనాభాలో 6.8% మాత్రమే. దీనిని జనన రేటు తగ్గుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో పక్కా ఇళ్ల సంఖ్య పెరిగినా, అద్దె ఇళ్లపై ఆధారపడే కుటుంబాలు కూడా గణనీయంగా ఉన్నట్టు సర్వే నివేదిక సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి ఉన్నప్పటికీ, సమాన అవకాశాల విషయంలో ఇంకా పెద్ద సవాళ్లు ఉన్నాయని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని కులాల యువతలో ఆంగ్ల మాధ్యమ విద్య ఎక్కువగా ఉండగా, మరికొన్ని వర్గాల్లో అది చాలా తక్కువగా ఉంది.
కొందరికి సమకూరుతున్న సకల వసతులు
మరికొందరి పరిస్థితి జీవన పోరాటం
అభివృద్ధితో పాటు అసమానతలు సైతం..
కులాల వారీగా బీసీ జనాభే అధికం
నగర పరిస్థితులపై సమగ్ర సర్వేలో వెల్లడి


