చార్మినార్: చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ బుధవారం సాయంత్రం చార్మినార్ నడిరోడ్డులో దుకాణదారులు, వీధి వ్యాపారుల సమక్షంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చార్మినార్ కట్టడం ప్రాంగణంలో రోడ్డుపై కూర్చోబెట్టి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చార్మినార్ పరిసరాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వారిని పిలిపించి.. ఎలాంటి బెదిరింపులకు పాల్పడవద్దని కఠినంగా హెచ్చరించారు. తమ హెచ్చరికలను లెక్కచేయని వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నామన్నారు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపామమన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని.. వినకపోతే..రౌడీ షీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు తమతో పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, చార్మినార్ ఎస్హెచ్ఓ రాంబాబు పాల్గొన్నారు.
రౌడీషీటర్లతో చార్మినార్ జోన్ డీసీపీ


