నగరంలో ‘అరైవ్–అలైవ్’ నిర్వహణ
సాక్షి, సిటీబ్యూరో/విజయ్నగర్కాలనీ: ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నగర పోలీసు విభాగం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బుధవారం చిన్నారుల భద్రత, దానికి సంబంధించిన నిబంధనలపై నగర వ్యాప్తంగా అవగాహన కల్పించింది. వివిధ పాఠశాలలతో పాటు కూడళ్లలో శిబిరాలు నిర్వహించిన పోలీసులు చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారూ (పిలియన్ రైడర్) కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్న చిన్నారులను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ హార్నెస్గా పిలిచే బెల్ట్ కచ్చితంగా ఉండాలి. నాలుగేళ్ల పై బడిన వారూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ‘అరైవ్–అలైవ్’లో భాగంగా ఈ విషయాన్ని నగర పోలీసులు ప్రచారం చేశారు. బుధవారం విజయ్నగర్కాలనీలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్, కలెక్టర్ హరిచందన దాసరి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు 30 హెల్మెట్లు, 200 వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో పోలీసులు అరైవ్–అలైవ్ ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లు అందజేశారు.


