కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులే
–ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ‘ఫేస్ టు ఫేస్’లో వక్తలు
హిమాయత్నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫేస్ టు ఫేస్’కార్యక్రమంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గన్ కల్చర్ పెరిగి, లాఅండ్ఆర్డర్ భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ ఓడిపోతామోననే భయంతో మైనార్టీల ఓట్ల కోసం అజహరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. అనంతరం ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టి 23 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ డివిజన్లోని ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాలు ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధికి ఎందుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


