ఉప ఎన్నికల నేపథ్యంలో గరం.. గరం
● ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం
● అంతర్గత కుమ్ములాటలతో సతమతం
● తుది దశకు చేరుకున్న అభ్యర్థుల ఎంపిక
సాక్షి, సిటీబ్యూరో: ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ హీటెక్కింది. ఈ నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. మరోవైపు సొంత పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు కేడర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరి బలహీనతలను మరొకరు బయట పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పక్షాలు రంగంలోకి దిగి ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పాడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా? అన్న విధంగా పోరు కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
కాంగ్రెస్ చేతిలో బీసీ కార్డు..
అధికార కాంగ్రెస్ ఉప ఎన్నికలో బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమా ర్ గౌడ్ ప్రకటించారు. మరోవైపు అధిష్టానానికి పంపిన షార్ట్ లిస్ట్లో ముగ్గురు బీసీలు, ఒకరు ఓసీ ఉన్నారు. బీసీ అభ్యర్థిత్వం ప్రాధాన్య క్రమంలో ఓసీ అభ్యర్థి బరి నుంచి తప్పించినట్లయింది. ము గ్గురు బీసీల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం తాను టికెట్ రేసులో లేనంటూనే.. అధి ష్టానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రచార దూకుడు..
అభ్యర్థి ఎంపికలో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రచారానికి దిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని రంగంలోకి దిగారు. అధికార కాంగ్రెస్పై వ్యతిరేకత. మాగంటి గోపీనాథ్ సేవలు, మహిళా సానుభూతి పవనాలు గెట్టేక్కిస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో చేజారకుండా ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంది.
బలోపేతానికి బీజేపీ కసరత్తు..
భారతీయ జనతాపార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో ఆ పార్టీకి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ.. రాష్ట్రంలో పెరిగిన బలంతో ఈసారి కాంగ్రెస్సే తమకు పోటీ అని భావిస్తోంది. ఇప్పటికే కమలనాథులు రంగంలోకి దిగి సుడిగాలిలా పర్యటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆర్.రామకృష్ణ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరా రు కోసం ఆ పార్టీ అభిప్రాయ సేకరణ చేస్తోంది.
హీటెక్కిన జూబ్లీహిల్స్
హీటెక్కిన జూబ్లీహిల్స్