
నగరా మోగింది!
407 పోలింగ్ కేంద్రాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
నవంబర్ 11న పోలింగ్ ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ నామినేషన్లకు చివరి తేదీ 21 24 వరకు ఉపసంహరణకు గడువు 407 కేంద్రాల్లో పోలింగ్
ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్లు
జిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వ్యవహరిస్తుండగా, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ బాధ్యతలు నిర్వహిస్తారు. నామినేషన్లను ఆర్డీవో కార్యాలయంలో స్వీకరిస్తారు. జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈఆర్ఓగా వ్యవహరిస్తారు. జాయింట్ పోలీస్ కమిషనర్ నోడల్ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరగనుంది.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీ సజ్జనర్ తెలిపారు. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు డిపాజిట్ చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ కానుండగా, నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించిన వివరాల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్తో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అది వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నప్పటికీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మాత్రం ఎన్నికల కోడ్ వర్తించదు.
–సాక్షి, సిటీబ్యూరో
నోటిఫికేషన్: 13 అక్టోబర్ (సోమవారం)
నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి దాదాపు 980 మంది ఓటర్లుంటారు
నియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరున్నదీ, లేనిదీ ఈఆర్ఓ కార్యాలయంలోకానీ, బూత్లెవెల్ అధికారి వద్ద కానీ, ఓటర్ హెల్ప్లైన్ యాప్లోకానీ, సంబంధిత వెబ్సైట్లలో కానీ పరిశీలించుకోవాల్సిందిగా కర్ణన్ సూచించారు.
జాబితాపై ఏవైనా అభ్యంతరాలున్నా, జాబితాలో పేరు లేకున్నా నామినేషన్ల చివరి రోజుకు పదిరోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసం 1950 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.
ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన, ఫొటో కలిగిన 12 రకాల ఐడీల్లో ఏదైనా ఒకదాన్ని వినియోగించుకోవచ్చునన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది
నోడల్ ఆఫీసర్లు: 19 మంది
సెక్టార్ ఆఫీసర్లు: 38 సెక్టార్లకు 55 మంది నియామకంతోపాటు రిజర్వులో కొందరిని ఉంచారు.
రిజర్వుతోసహ మొత్తం పోలింగ్ సిబ్బంది: 2,400
వీరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు: 600 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 600 మంది, ఇతర సిబ్బంది 1200 మంది.
ఈవీఎంలు, వీవీప్యాట్లు
కంట్రోల్ యూనిట్లు: 826, బ్యాలెట్ యూనిట్లు: 1494, వీవీప్యాట్లు: 837.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇప్పటికే మొదటిదశ తనిఖీ పూర్తయిందన్నారు.
ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)
షెడ్యూలు జారీతోనే ఎన్నికలప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ప్లాన్ రెడీ అయిందని పేర్కొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ కోసం 9 ఫ్లై యింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాల కనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు. ఫిర్యాదులకోసం కాంటాక్ట్ నెంబర్ 1950 , కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తాయన్నారు. సీజ్ చేసిన నగదు పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇంకా..
శారీరక వికలాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి వీల్చైర్ సదుపాయం, వాలంటీర్ల ద్వారా ఇళ్లనుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి, తిరిగి ఇళ్లవద్ద దింపే సదుపాయం.
పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వార్తాపత్రికలు, టీవీల్లో మూడు పర్యాయాలు ప్రకటించాలి.
రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాల్ని 48 గంటల్లో వెబ్సైట్, సోషల్మీడియా,పత్రికలు, టీవీల ద్వారా వెల్లడించాలి. ‘నో యువర్ క్యాండిడేట్స్’ యాప్ ద్వారా కూడా ప్రజలు అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు.
మీడియా ఫేక్న్యూస్ ప్రచారం చేయొద్దు. సంబంధిత అధికారుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. వదంతుల్ని ప్రచారం చేయవద్దు.
139 భవనాల్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్లు, టాయ్లెట్స్, తాగునీరు, లైటింగ్, పోలింగ్ కేంద్రమని సూచించే బోర్డులు, వీల్చైర్లు, తదితర సదుపాయాలుంటాయన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఆయా పార్టీల నుంచి బూత్లెవెల్ ఏజెంట్లున్నారన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి 219 మంది, కాంగ్రెస్ నుంచి 132 మంది ఉన్నారని, ఇతర పార్టీలవి పెండింగ్లో ఉన్నాయన్నారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి 407 మంది బీఎల్ఓలు, 38 మంది సూపర్వైజర్లను నియమించినట్లుపేర్కొన్నారు.
21,003 ఎపిక్ కార్డులు జనరేట్ కాగా, 8,491 కార్డుల ముద్రణ పూర్తయిందని, మిగతావి ఆయా దశల్లో ఉన్నాయన్నారు. 8,491 కార్డుల్ని పోస్టు ద్వారా పంపిణీ చేసినట్లు కర్ణన్ తెలిపారు.