
ఏసీబీ వలలో అవినీతి చేపలు!
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తూంకుంట మున్సిపల్ సిబ్బంది
శామీర్పేట్: తూంకుంట మున్సిపల్ సిబ్బంది లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలివీ... తూంకుంట మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన శామీర్పేట వార్డులో విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు రూ. 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శామీర్పేట వార్డు పరిధిలో ఓ వ్యక్తి రెండు ఇళ్లను కొనుగోలు చేసి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాదిన్నరగా మ్యుటేషన్ కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. శామీర్పేట వార్డు ఆఫీసులో పని చేసే బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్లు లంచం డిమాండ్ చేశారని, దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఒక స్థలం.. డబుల్ రిజిస్ట్రేషన్.. ప్లాట్ విక్రయించి వ్యక్తి అరెస్టు
దుండిగల్: ఒకే స్థలాన్ని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... మల్లంపేట ప్రాంతానికి చెందిన జె.అశోక్ కుమార్ అలియాస్ సారా అశోక్ స్థానికంగా ఉన్న 195, 196వ సర్వే నెంబర్లలోని 9.39 గుంటల్లో గతంలో వెంచర్ వేశాడు. మౌలాలికి చెందిన అన్వర్ ఖాతూన్ అనే మహిళ బాచుపల్లికి చెందిన మోహన్రెడ్డి సహకారంతో 1986 సంవత్సరంలో సదరు వెంచర్లో ప్లాట్ను కొనుగోలు చేసింది. కొన్నాళ్ల వరకు ఖాతూన్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్లాట్ వద్దకు రాలేదు. ఇది గమనించిన అశోక్ సదరు ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా 2004 సంవత్సరంలో అశోక్ సదరు స్థలాన్ని మోహన్రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. 2023లో ఖాతూన్ ఆమె కుటుంబ సభ్యులు ప్లాట్ వద్దకు రావడంతో మోసం వెలుగుచూసింది. మోహన్రెడ్డి పేరుపై ప్లాట్ను మార్చినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన అశోక్కుమార్ను నిందితుడిగా గుర్తించారు. గురువారం అశోక్కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో అశోక్కుమార్తో పాటు ఇతరుల పాత్ర ఏమైనా ఉందా.. ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు ఇంకేమైనా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏసీబీ వలలో అవినీతి చేపలు!