వైద్యశాఖకు ‘గోషామహల్‌ స్టేడియం’ | - | Sakshi
Sakshi News home page

వైద్యశాఖకు ‘గోషామహల్‌ స్టేడియం’

Jun 4 2025 8:26 AM | Updated on Jun 4 2025 4:39 PM

వైద్యశాఖకు ‘గోషామహల్‌ స్టేడియం’

వైద్యశాఖకు ‘గోషామహల్‌ స్టేడియం’

ఉస్మా‘నయా’ ఆస్పత్రి కోసం 31 ఎకరాల 39 గుంటలు

సాక్షి, సిటీబ్యూరో: అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్‌లో శివకుమార్‌ లాల్‌ పోలీ సు స్టేడియం ప్రాంతానికి తరలించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు సైతం ప్రారంభమైంది. మొత్తం 43 ఎకరాల 37 గంటల ఈ స్టేడియం స్థలం నుంచి 31 ఎకరాల 39 గుంటలు ఆస్పత్రికి, 11 ఎకరాల 38 గుంటలు పోలీసు అవసరాలకు కేటాయించారు. కొత్త ఉస్మా నియా ఆస్పత్రికి కేటాయించిన స్థలాన్ని నగర పోలీ సు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం వైద్యశాఖకు అప్పగించారు. మిలిగిన స్థలంలో పోలీసు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నారు.

అదనంగా మరో రెండు ఎకరాలు..

ప్రస్తుతం గోషామహల్‌లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో ఓ పక్క స్టేడియం, సిటీ సెక్యూరిటీ వింగ్‌ కార్యాలయం, డాగ్‌ స్క్వాడ్‌, అశ్విక దళంతో పాటు శిథిలమైన కొన్ని పోలీసు క్వార్టర్స్‌ కూడా ఉన్నాయి. వీటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అమరుల స్తూపం ఉండగా దాన్నే పోలీసు అధికారులు గ్రౌండ్‌గా వినియోగిస్తున్నారు. ఈ స్తూపానికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా, సముచిత ప్రాధాన్యం ఇస్తూ స్డేడియంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. దీనికోసం సర్కారు రూ.55 కోట్లు మంజూరు చేసింది. అశ్వికదళం కోసం తాత్కాలికంగా నిర్మించిన 24 షెడ్లను ఆనంద్‌ మంగళవారం ప్రారంభించారు. తాత్కాలిక ప్రాతిపదికన డాగ్‌ స్క్వాడ్‌ను బేగంపేటలోని పోలీసు క్వార్టర్స్‌లోకి పంపారు. ఈ స్థలానికి అదనంగా ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (టీటీఐ) వద్ద మరో రెండు ఎకరాలు నగర పోలీసు విభాగానికి కేటాయించింది. ఇక్కడ కెన్నెల్‌ వింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఆ వాహనాలు శిథిలం కాకుండా..

నగరంలోని ఏడు జోన్లకు సంబంధించిన పోలీసులు వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ప్రస్తుతం ఈ స్టేడియంలోనే ఉంచుతున్నారు. వీటికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి శిథిలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త నిర్మాణాల్లో భాగంగా ఈ వాహనాల కోసం ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. పక్కనే మరో నాలుగు అంతస్తుల్లో సీఎస్‌డబ్ల్యూ, సీటీసీలతో పాటు ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మిస్తారు. మిగిలిన ప్రాంతంలో స్టేడియం, గ్రౌండ్స్‌ ఉండనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రి కోసం ప్రభుత్వం గోషామహల్‌ స్టేడియం ప్రాంగణం నుంచి 25 ఎకరాలు తీసుకుంటున్న నేపథ్యంలో.. దీనికి ప్రతిగా ఆరాంఘర్‌ ప్రాంతంలో 12 ఎకరాలను పోలీసు విభాగానికి కేటాయించింది. ఈ స్థలంలో రాష్ట్ర స్థాయి బ్యారెక్స్‌, ప్లేగ్రౌండ్‌, డ్రిల్‌ ఏరియా నిర్మించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది.

రహదారులు సైతం విస్తరణకు ప్రతిపాదనలు..

ఎన్నికలతో పాటు బోనాలు, గణేష్‌ ఉత్సవాలతో పాటు ఇతర కీలక బందోబస్తుల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే బలగాల కోసం ఈ బ్యారెక్స్‌ వినియోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న వీటిలో ఉన్నతాధికారుల కోసమూ కొన్నింటిని కేటాయించనున్నారు. గోషామహల్‌ స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ చుట్టు పక్కల ఉన్న రహదారులపైనా ప్రభుత్వ విభాగాలు దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అది వాణిజ్య ప్రాంతం కావడంతో పాటు రోడ్లన్నీ ఇరుకుగా ఉంటాయి. ఆస్పత్రి నిర్మాణం ప్రారంభంతోనే ఈ రోడ్ల విస్తరణకూ చర్యలు చేపట్టనున్నారు. ఆస్పత్రి చుట్టూ 30, 60, 100 అడుగుల వెడల్పుతో రోడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికోసం ఇప్పటికే అధికారులు సర్వే సైతం ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న రోడ్ల స్థితిగతులు, కొత్త వాటి కోసం సేకరించాల్సిన ఆస్తులు, కూల్చివేతలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం.

అప్పగించిన పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌

మిగతా 11 ఎకరాల 38 గుంటల్లో పోలీసు నిర్మాణాలు

స్వాధీనం చేసుకున్న వాహనాలకు ప్రత్యేక భవనం

వివరాలు వెల్లడించిన సిటీ కొత్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement