
వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్టు
నాగోలు: వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని పహాడీషరీఫ్ పోలీస్లు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి అభణాలు, నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్నగర్ జిల్లాలోని గజలపేట గ్రామానికి చెందిన అల్లం శివ (27) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి అంబర్పేట్లో నివాసం ఉంటున్నాడు. మద్యం, డ్రగ్స్, బెట్టింగ్ల వంటి దుర్వ్యసనాలకు బానిసైన శివ డబ్బు కోసం నేరాలను ప్రారంభించాడు. 2023, 2024లలో అంబర్పేట్, వెల్దండ, ఊర్కొండ, మిడ్జిల్, మంచాల్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుండి విడుదలయ్యాక కూడా తీరు మార్చకోకుండా పహాడీషరీఫ్, హయత్నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చోట్ల మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా బుధవారం షాలిబండలో దొంగిలించిన వస్తువులను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పహాడీషరీఫ్ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారణ చేయగా 7 చోట్ల చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతని వద్ద నుండి పోలీసులు 17 తులాల బంగారు ఆభరణాలు, 41 తులాల వెండి ఆభరణాలు, రూ. 50 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. శివను పహాడీషరీఫ్ డిఐ జితేందర్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ బృందం పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ బి.వి.సత్యనారాయణ, ఏసీపీ జానకిరెడ్డి, పహాడీషరీఫ్ సీఐ గురువారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్టు