
ఏప్రిల్లోగా సుంకిశాల పనులు పూర్తి..!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి కృష్ణాజలాల తరలింపుకోసం చేపట్టిన సుంకిశాల ఇంటేక్ వెల్ పనులను ఏప్రెల్ నాటికి పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ సంస్థ సీఈఓ, డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు, టీసీఎస్, గేట్ల ఎక్స్పర్ట్, తదితరులతో కలిసి సుంకిశాల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తొలుత ఉన్నతాధికారులతో కలిసి పైప్లైను విస్తరణ పనులను తనిఖీ చేశారు. ఇప్పటి వరకు మిగిలిపోయిన పైప్లైన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. వర్షాకాలం సమీపించినందున పైప్లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మాణ సంస్థ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నిపుణులతో కలిసి సుంకిశాల పునర్నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీడిజైనింగ్ సంబంధించిన వివరాలపై చర్చించారు. శిథిలాల తొలగింపు అనంతరం సివిల్ వర్క్, కంట్రోల్ రూం పనులను వేగంగా ముగిస్తే సైడ్ వాల్ పునర్నిర్మాణానికి మార్గం సులువవుతుందని అంచనా వేశారు. అనంతరం నాగార్జున సాగర్ జలాశయం వైపు ఉన్న టన్నెలింగ్ పనులను పరిశీలించారు. టన్నెలింగ్ వద్ద గేట్ల నిర్మాణం, డిజైన్లపై నిపుణుడు కన్నయ్య నాయుడుతో చర్చించారు.
15 రోజుల్లో పునర్నిర్మాణ డిజైన్ ఫైనల్
సుంకిశాల ఇంటేక్ వెల్ రిటైనింగ్ వాల్ శిథిలాలను తొలగింపు పూర్తిచేసి పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు డిజైన్లు, డ్రాయింగ్ లను 15 రోజుల్లో ఫైనలైజ్ చేయాలని ఎండీ ఆదేశించారు. పునర్నిర్మాణ పనులు చేపట్టి ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను సూచించారు. ఇంటేక్ వెల్ ప్రాజెక్టు పైప్లైన్ పనులు నాలుగు కిలోమీటర్లు మినహా పూర్తి చేశామన్నారు. ఎలక్ట్రిక్ పనులు సైతం చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, ిసీజీఎం మహేష్ కుమార్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్లు శశిధర్, సురేంద్రనాథ్, గేట్ల రూపకర్త కన్నయ్య నాయుడు, టీసీఈ ప్రతినిధి నితీష్, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
పనులు వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థకు ఆదేశాలు
ప్రాజెక్టు పనులను పరిశీలించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి