నల్లకుంట: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో మంగళవారం ఓ కోవిడ్ ఆనుమానిత కేసు నమోదైంది. హిమాయత్నగర్కు చెందిన వ్యక్తి(50) ఇటీవల తీర్థ యాత్రలకు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన అతను స్థానిక వైద్యుడి సూచన మేరకు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో అతను మంగళవారం మధ్యాహ్నం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వచ్చాడు. అతడి రిపోర్టులను పరిశీలించిన ఆసుపత్రి డీఎంవో కోవిడ్గా అనుమానిస్తూ మందులు రాసి ఇచ్చాడు. కోవిడ్ లక్షణాలు ఉండడంతో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇన్ పేషంట్గా చేరితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తామని తెలిపారు. అందుకు అతను తిరస్కరిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటానని చెప్పడంతో అతడి కుటుంబ సభ్యులందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
యూఎస్ వీసా ఇప్పిస్తానంటూ మోసం..
నిందితుడిపై కేసు నమోదు
బంజారాహిల్స్: యూఎస్ వీసా పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..గచ్చిబౌలికి చెందిన కాసా ప్రణయ్యాదవ్ అమెరికాలోని రుట్గర్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు బషీర్ అహ్మద్ అనే వ్యక్తిని సంప్రదించాడు. యూఎస్ వీసా కోసం సర్వీసు చార్జీల కింద రూ.50 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో అడ్వాన్స్గా రూ.20 వేలు చెల్లించాడు. వీసా అఫ్రూవల్ కోసం ఎంబసీ ఆఫీసర్ ఒకే ఒక్క ప్రశ్న వేస్తాడని, దాంతో వీసా అఫ్రూవల్ అవుతుందని బషీర్ అహ్మద్ చెప్పాడు. అయితే ప్రణయ్యాదవ్ ఎంబసీకి వెళ్లి హాజరుకాగా ఆయనను ఏడు ప్రశ్నలు అడిగాడు. అందుకు సమాధానం చెప్పలేకపోవడంతో వీసా రిజక్ట్ అయ్యింది. తనను వీసా పేరుతో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
మూసాపేట: అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వివేకానందనగర్లోని మయూరి కర్రీ పాయింట్లో బిహార్కు చెందిన విజయ్ (32) అనే వ్యక్తి కుక్కు అసిస్టెంట్గా పనిచేస్తూ వాసిరెడ్డి స్వగృహ భవనంలోని 3వ అంతస్తులో ఉంటున్నాడు. ఈనెల మంగళవారం తెల్లవారుజామున పెద్దశబ్ధం రావటంతో వాచ్మెన్ వెళ్లి చూడగా విజయ్ కిందపడి ఉన్నాడు. స్థానికుల సహాయంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యం తాగే అలవాటు ఉన్న విజయ్ తాగిన మైకంలో ప్రమాదవశాత్తు కిందపడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.