
బడికి బాట దొరికింది...
సికింద్రాబాద్: చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు బాట దొరికింది. ఆ మార్గానికి అడ్డంగా స్థానికులు కట్టిన గోడను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చేశారు. ఈ గోడ కారణంగా పాఠశాలకు వచ్చి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జునరెడ్డి సోమవారం నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట ‘మా బడికి బాట వేయండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై సమాచారం అందడంతో స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిందిగా ఇన్స్పెక్టర్ ఆదిత్యను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన ఆ పాఠశాలకు వెళ్లే మార్గంలో అడ్డుగా గోడ ఉన్నట్లు నిర్థారించారు. మంగళవారం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి గోడను తొలగించారు. త్వరలోనే అక్కడ గేటు ఏర్పాటు చేయనున్నట్లు బల్దియా జోనల్ కమిషనర్ రవి కిరణ్ ప్రకటించారు.
దారికి అడ్డుగా కట్టిన గోడ తొలగించిన హైడ్రా