
తనకు అడ్డు వస్తున్నాడని..
బంజారాహిల్స్: తనకు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి సొంత బావనే దారికాచి కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఫస్ట్లాన్సర్కు చెందిన మహ్మద్ ఇలియాస్ (47) సెంట్రింగ్ పని చేసేవాడు. అతడి బావమరిది అబ్దుల్ సత్తార్ మాసబ్ట్యాంక్ సమీపంలో ఓ చికెన్ షాపులో తండ్రి షేక్ అబ్దుల్ వాహెబ్, సోదరుడు గౌస్తో కలిసి పని చేసేవాడు. మద్యానికి బానిసైన సత్తార్ కొంతకాలంగా డబ్బుల కోసం తండ్రి, సోదరుడితో తరచూ గొడవపడటమేగాక డబ్బులు లాక్కెళ్లేవాడు. ఈ నేపథ్యంలో తండ్రిని, సోదరుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని, మద్యం తాగడం మానేయాలని అతడి బావ మహ్మద్ ఇలియాస్ పలుమార్లు సత్తార్కు హితవు పలికాడు. డబ్బులు ఇవ్వకుండా తండ్రిని నియంత్రించాడు. ఈ విషయమై ఆదివారం రాత్రి ఇలియాస్, సత్తార్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డబ్బుల కోసం తండ్రిని వేధించవద్దని, మరోమారు ఇబ్బందులకు గురిచేస్తే బాగుండదని బావమరిదిని హెచ్చరించిన ఇలియాస్ ఫస్ట్లాన్సర్లోని తన ఇంటికి వచ్చాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సత్తార్ పథకం ప్రకారం చికెన్ షాపులోని కత్తిని జేబులో పెట్టుకుని బావను వెంబడించాడు. ఇంట్లోకి వెళ్తున్న ఇలియాస్ను బయటికి లాగి పొత్తి కడుపులో విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఇలియాస్ను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సత్తార్పై కేసు నమోదు చేశారు. నాలుగు గంటల్లోనే పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావను హత్య చేసిన బావమరిది

తనకు అడ్డు వస్తున్నాడని..