● రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నయీంనగర్: ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బుధవారం హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం ఇందిరానగర్ సంక్షేమ హాస్టల్, కిషన్పురలో విద్యార్థులతో ముఖాముఖిగా ఏర్పాటు చేసిన ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్ను నిర్మించే యువతకు నాణ్యమైన విద్య, పారదర్శక పరీక్ష విధానం నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతన్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దులు, రీ–ఎగ్జామ్స్ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటూ లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సంవత్సరాలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా వారి కృషి వృథా అవుతోందని వాపోయారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


