ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం నిర్వహించే ఫర్టిలైజర్ షాపుల బంద్ను విజయవంతం చేయాలని ది డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్లోని అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల సరఫరా విషయంలో డీలర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం ఆల్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా స్వచ్ఛందంగా షాపుల బంద్ పాటించాలని సూచించారు. శివనగర్లోని అసోసియేషన్ భవనం వద్ద ఉదయం 8:30 గంటలకు డీలర్లు అధిక సంఖ్యలో హాజరై బంద్కు మద్దతుగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బీఎన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శులు దేసు ప్రవీణ్, ముక్కెర సతీశ్, సంయుక్త కార్యదర్శి గోమాత సంపత్రెడ్డి పాల్గొన్నారు.


