● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాయపర్తి: గన్నీ సంచులతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంచుల కొరత సమస్య పరిష్కరించి వర్షం రాకముందే కాంటాలు పెట్టి అన్నదాతలను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మొక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు శనివారం మండల కేంద్రంలోని వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మాట్లాడారు. గన్నీ సంచుల కొరతతో మొక్కజొన్న రైతులు ఆగమవుతున్నారని, వెంటనే సమస్య పరిష్కరించి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. అనంతరం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. తాము వస్తున్నామని కాంటాలను మొదలు పెట్టడం ఏంటని, త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, డీఎంతో ఫోన్లో మాట్లాడారు. వర్షం వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని, తడిసిన ప్రతీ మొక్కజొన్న గింజను కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, గారె నర్సయ్య, ఐత రాంచందర్, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


