హన్మకొండ: ఐక్యత బలం, భరోసా, విజయాన్ని అందిస్తుందని ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్లో వరంగల్ రీజియన్ ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులంతా ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపిందన్నారు. ఆర్టీసీలో ఐక్య ఉద్యమాలు, పోరాటాలు చేసి డిమాండ్లు సాధించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ ఉద్యమంలో అసువులు బాసిన అమరుడు డ్రైవర్ కోలా శంకర్ గౌడ్కు ఎస్డబ్ల్యూఎఫ్ నివాళులర్పిస్తుందన్నారు. వారి కుటుంబానికి జిల్లా జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. యాజమాన్యం నుంచి అందాల్సిన ప్రయోజనాలు కుటుంబానికి అందించేందుకు జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సహకరించి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ నాయకులు శ్రీనివాస్, బీయూ.చారి, సీహెచ్.యాక స్వామి, డీకే రెడ్డి. ఈఎస్.బాబు, యూఆర్.కృష్ణ, రంజిత్, మహేందర్, వెంకటేశ్వర్లు, కేఎస్ రెడ్డి, శోభన్బాబు, బాబు నాయక్, రమేశ్, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్


