హన్మకొండ: ఓరుగల్లు పోరాట వారసత్వాన్ని కవిత్వం రూపంలో వనపాక దిలీప్ రాస్తున్నారని ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దిలీప్ రాసిన దసుముడి కవిత సంకలనాన్ని మానవ హక్కుల వేది ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యురాలు, సీనియర్ జర్నలిస్ట్ వేమన వసంత లక్ష్మి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ బాలగోపాల్ వారసత్వాన్ని, ఆలోచనలు నింపుకున్న దిలీప్ ఈ తరం యువతకు ఆదర్శం అన్నారు. వేమన వసంత లక్ష్మి మాట్లాడుతూ దిలీప్ ఆలోచనలు భావస్పోరకం అన్నారు. ప్రధాన వక్త యాకూబ్ మాట్లాడుతూ.. సంకలనంలోని వివిధ కవితల్లో అతి ముఖ్యమైన పద బంధాలను వివరించారు. కవి తగుళ్ల గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, ప్రముఖ నవలా రచయిత పి.చందు, డాక్టర్ చంద్రబాను, యువకులు కళాకారులు, రచయిత వనపాక దిలీప్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


