హన్మకొండ: వివిధ రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖులకు ఎంవీఎంఆర్ ఫౌండేషన్ స్మారక విశిష్ట ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. శనివారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్యెల్యే గుమ్మడి నర్సయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ లోగో ఆవిష్కరించారు. విద్య, వైద్యం, కళలు, వ్యవసాయం, క్రీడా రంగంలో రాణిస్తున్న వారికి అవార్డులు ప్రదానం చేశారు. అందుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ప్రముఖ సాహితీవేత్త అంపశయ్య నవీన్, చెప్యాల మనోహర్ రావు, సంఘ సేవకురాలు కరుకాల అనితా రెడ్డి, విద్యావేత్త ప్రొఫెసర్ తెన్నీటి విజయచంద్ర, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సంధ్యారాణి, ఫోరం బెటర్ వరంగల్, ప్రముఖ వ్యాసకర్త పుల్లూరు సుధాకర్, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు, కోచ్ ఎస్.అప్పారావు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంవీఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏసీపీ ఎం.జితేందర్రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, సోదరుడి స్మారకంగా ఈ ఫౌండేషన్ను 2024లో స్థాపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ టి.యాదగిరిరావు, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ ఘంటా సంజీవరెడ్డి, మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేష్, కిట్స్ పీఈడీ పి.రమేష్ రెడ్డి పాల్గొన్నారు.


