కాశిబుగ్గ: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. వరంగల్ ఆటోనగర్లోని గిర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సాహం అందించాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని కోరారు. ఏఎంఓ సుజన్ తేజ మాట్లాడుతూ ఆధునిక బోధన పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం భూపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్ఓ కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఝెలుగం సత్యనారాయణ, చిప్ప వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను డీఈఓ పంపిణీ చేశారు. ప్రతీ విద్యార్థి ఫొటోతో కూడిన ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించారు.


