కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎట్టకేలకు సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. గత కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువు మే 6గా నిర్ణయించారు. యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఆరు ఖాళీలున్నాయి. అర్హులైన ఆరుగురు సూపరింటెండెంట్లకు పదోన్నతులు లభించనున్నాయి.
అర్హతలు ఇలా..
అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదోన్నతులకు దరఖాస్తులు చేసుకునేవారు యూనివర్సిటీలో సూపరింటెండెంట్గా పని చేస్తూ 5 ఏళ్ల పాటు సర్వీస్ కలిగి ఉండాలి. ఓవరాల్గా యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. సీనియార్టీ కమ్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ గ్రేడ్ పోస్టుగా పదోన్నతులకు చేపడతారు. పదోన్నతుల కల్పనకు నూతన విధి విధానాలు ఖరారు చేశారు. రాత పరీక్ష, సర్వీస్ వెయిటేజ్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, ఇంటర్వ్యూలు కలిపి మొత్తంగా 100 మార్కులకు అర్హత సాధించినవారికి సెలక్షన్ విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష ఈఏడాది జూన్ 10న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 30 మార్కుల రాత పరీక్షకు 100 ప్రశ్నావళికి సంబంధించి ప్రిపేరేషన్ క్వశ్చన్ బ్యాంకు పుస్తకాన్ని ముందుగానే యూనివర్సిటీ అధికారులు అర్హులైన సూపరింటెండెంట్లకు అందిస్తారు. 50 మార్కులు సర్వీస్ వెయిటేజ్, కాన్ఫిడెన్షియల్ రిపోర్టుకు 10 మార్కులు, ఇంటర్వ్యూకు10 మార్కులు కేటాయించారు.
● ఆరు ఏఆర్ పోస్టుల వేకెన్సీల్లో ప్రమోషన్స్
● దరఖాస్తులకు చివరి గడువు మే 6
● జూన్ 10న రాత పరీక్ష


