కేయూ క్యాంపస్ : ఉన్నత విద్య సిలబస్లో విస్తృతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తదనుగుణంగా విశ్వవిద్యాలయాలు సిలబస్లతో సిద్ధంగా ఉండాలని, త్వరలోనే కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలుల్లోకి రానుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం కేయూ అకడమిక్ కమిటీ హాల్లో వీసీ కె. ప్రతాప్రెడ్డి సమక్షంలో అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)కు అనుగుణంగా క్రెడిట్ విధానం అమలుచేయబోతున్నామన్నారు. ఈ దిశగా యూనివర్సిటీల వీసీలతో ఇప్పటికే వివిధ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ 2026–2027 విద్యాసంవత్సరానికి సీపీజీఈటీ నిర్వహణను కేయూకు అప్పగించినందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, వివిధ పరిపాలన అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిను సన్మానించారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి


