వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీలోని ప్లాస్టిక్ నిర్మూలన, పచ్చదనాన్ని ఇతర కాలనీలవాసులు ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ ఓసిటీ కాలనీలో నిర్వహిస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కలెక్టర్ ఆదివారం పాల్గొని మాట్లాడారు. కాలనీవాసులంతా కలిసి ఏడు విడతలుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ, పచ్చదనం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, టెర్రస్ గార్డెనింగ్ను కూడా ప్రోత్సహించాలని వారికి సూచించారు. అనంతరం, పచ్చదనం, ప్లాస్టిక్ నిర్మూలనపై ఓసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించి, క్లాత్ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి బజ్జూరి వేణుగోపాల్, ఉద్యాన శాఖ అధికారి లక్ష్మారెడ్డి, డీపీఆర్ఓ ప్రేమలత, శానిటరీ ఇన్స్పెక్టర్ భూమయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 160 మంది విద్యార్థులకు 113 మంది హాజరుకాగా 47 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కార్యాలయ ఏసీజీ భువనేశ్వరి తెలిపారు. అలాగే, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మధ్యాహ్నం సెషన్లో నిర్వహించిన పరీక్షకు 114 మంది విద్యార్థులకు 67 మంది హాజరుకాగా.. 47 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు.
కాశిబుగ్గ: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ అన్నారు. ఎల్బీనగర్లోని అబ్నూస్ ఫంక్షన్లో హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్తో పోల్చి మాట్లాడడం బీజేపీ నాయకులకు సరైంది కాదని హెచ్చరించారు. గతంలో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టే తీసుకువచ్చిందని, మహిళలకు పెద్దపీట వేసి దేశానికి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు.
కాశిబుగ్గ : వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో కలుషితమైన పసుపు పచ్చని నీళ్లు సరఫరా అవుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వాసనతో కూడిన నల్లా నీళ్లు రావడంతో వాటిని పట్టుకోవడానికి వెనుకాడుతున్నారు. పచ్చని రంగుతో పాటు దుర్వాసనతో కూడి ఉండడంతో తాగునీటిగా వాడట్లేదు. అలాగే వాడుకోవడానికి సైతం ఈ నీళ్లు పనికిరావడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ నీటితో ముఖం కడుక్కోవడానికి ఉపయోగిస్తే నీటి వాసన భరించలేకపోతున్నామంటూ స్థానికుడు యాకుబ్పాషా ఆవేదన వెలిబుచ్చారు. అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటి కైనా గ్రేటర్ అధికారులు, పాలకవర్గం స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.


