హసన్పర్తి: ఎర్రగట్టు గుట్ట సమీపంలోని దళితుడి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తెలిపారు. ఈమేరకు శనివారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎర్రగట్టు గుట్ట సమీపంలోని కుమారస్వామి రిజిస్ట్రేషన్ ద్వారా స్థలాన్ని పొందినట్లు పేర్కొన్నారు. మాజీ ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రజాప్రతినిఽధితో పాటు ఓ జిల్లా అధికారి సహకారంతో ఆ భూమి చుట్టూ గోడ నిర్మాణానికి యత్నిస్తున్నారన్నారు. బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విద్యారణ్యపురి: ప్రభుత్వ, హనుమకొండ జిల్లాలో ఎయిడెడ్, ప్రైవేట్ తదితర యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఈ నెల 8నుంచి ప్రారంభమైన ఎస్ఏ–2 పరీక్షలు శనివారంతో ముగిశాయి. వెంటనే జవాబుపత్రాలను సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనం పూర్తిచేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి పత్రాలు అందజేయాల్సింటుందని డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బిరాంధన్ తెలిపారు. ఈనెల 24నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ఉంటాయి. మళ్లీ పాఠశాలలు జూన్12 నుంచి పునఃప్రారంభం అవుతాయని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు.
కాజీపేట అర్బన్: రైతు భవిష్యత్ను ఆయిల్పామ్ సాగు మారుస్తుందని, తెలంగాణలో కొత్త వ్యవసాయ విప్లవం మొదలైందని తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. కాజీపేట మండలం టేకులగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ సాగు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, హర్టికల్చర్ అధికారులు, ఆయిల్ఫెడ్ ప్రతినిధులు, రైతులున్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారిగా కొత్త ప్రశాంత్ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీఅండ్ఎండీ సోనీబాలాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీడీగా పదోన్నతి పొందిన డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ నుంచి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రశాంత్ కరీంనగర్, హనుమకొండ డీఎస్ఏలో బాస్కెట్బాల్ కోచ్గా విధులు నిర్వహించారు.
హన్మకొండ: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇండియా కూటమి తూట్లు పొడిచిందని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ విమర్శించారు. మహిళా సాధికారత, నియోజకవర్గాల పునర్విభజన భారత ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమైన అంశమని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఈ దేశాన్ని 64 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలనలో బిల్లులు పెట్టి అమలు చేయక మహిళలను మోసం చేసిందని తూర్పారబట్టారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదని విమర్శించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా, బీదరికం పెరుగుతుందని కుటుంబ నియంత్రణ పేరుతో దాదాపు 50 ఏళ్లుగా డీలిమిటేషన్కి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. దేశంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 1953లో ఆర్టికల్ 340 మేరకు కాకాకలేల్కర్ కమిషన్ వేసి అందించిన నివేదికను అమలు చేయలేదని విమర్శించారు. 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న దేశ ప్రజల కోరిక, ఆశయం.. నరేంద్ర మోదీ నాయకత్వంలో నెరవేరితే, భవిష్యత్లో అధికారంలోకి రాలేమని ఇండియా కూటమి అడ్డుపడడం దుర్మార్గమని దుయ్యబట్టారు.


