హన్మకొండ: మండుతున్న ఎండలు.. వడగాలలు.. ఉక్కపోతతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇళ్లకే పరిమితమైన జనం భానుడి ప్రతాపం నుంచి ఉపశమం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే పంటలు చేతికొచ్చే దశ కావడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గుతోంది.
గతఏడాదికంటే ఎక్కువే..
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్లో కరెంట్ వాడకం పెరిగిందని సంబంధిత శాఖ వెల్ల డించిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 11న విద్యుత్ డిమాండ్ 5,195 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడాది ఏప్రిల్ 11న కేవలం 3,249 మెగావాట్లే ఉండడం గమనార్హం. ఈ నెల 12న 5,209 మెగావాట్లు ఉండగా గతేడాది 3,297 మెగావాట్లు ఉంది. 13న 4,649 మెగావాట్లు నమోదవ్వగా గతేడాది ఇదే సమయంలో 3,214 మెగావాట్లుగా ఉంది. ఈ నెల 14న 4,438 మెగావాట్లు నమోదవగా గతేడాది ఇదే సమయంలో 3,127గా ఉంది. ఈ నెల 15న 4,380 మెగావాట్లు నమోదవగా గతేడాని ఇదే రోజు 3,115గా ఉంది. ఈ నెల 16న 4,245 మెగాట్లు నమోదవగా గతేడాది ఇదే తేదీన 2,800 మెగావాట్లుగా ఉంది.
యూనిట్ల వినియోగం(మిలియన్లలో..)
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం ఈ నెల 11న 87.54 మిలియన్ యూనిట్లుగా ఉండగా గతేడాది ఇదే తేదీన 61.21 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఏప్రిల్ 12న గతేడాది 62.89 మిలియన్ యూనిట్లు వినియోగించగా ఈ నెల 12న 87.13 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఏప్రిల్ 13న గతేడాది 62.01 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 82.17కు చేరుకుంది. ఏప్రిల్ 14న గతేడాది 60.46 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 80.76కు చేరుకుంది. ఏప్రిల్ 15న గతేడాది 59.87 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 79.42కు చేరుకుంది. ఏప్రిల్ 16న గతేడాది 52.43 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 74.32 యూనిట్లకు చేరుకుంది.
ప్రతి ఏటా విద్యుత్ వినియోగం వేసవిలో ఎక్కువగానే ఉంటుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని నాలుగు నెలల ముందుగానే విద్యుత్ అధికారులు వేసవి కార్యచరణ తయారు చేసుకుని పెరుగనున్న విద్యుత్ వినియోగం, డిమాండ్ను అంచనా వేసుకుని ముందస్తు చర్యలు చేపట్టి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగనుండడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముంది. ఇదే క్రమంలో వ్యవసాయానికి సాగు నీటి వినియోగం తగ్గనుండంతో విద్యుత్ వినియోగం, డిమాండ్ నిలకడగా ఉండే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు భావిస్తున్నారు.
మండుతున్న ఎండలు
ఉక్కపోతతో పెరిగిన కూలర్లు,
ఏసీలు, ఫ్యాన్ల వినియోగం
పంటలు చేతికొస్తుండడంతో
వ్యవసాయానికి తగ్గిన వినియోగం
ఈ నెల 16న టీజీ ఎన్పీడీసీఎల్ 4,245 మెగావాట్ల డిమాండ్
గతేడాది ఏప్రిల్ 16న
2,800 మెగావాట్లే..


