గాయత్రి చిల్లీస్‌ ట్రేడర్స్‌ యజమాని అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గాయత్రి చిల్లీస్‌ ట్రేడర్స్‌ యజమాని అరెస్టు

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

ఖిలా వరంగల్‌: వ్యాపారుల నుంచి మిర్చి కొనుగోలు చేసి బోర్డ్‌ తిప్పేసి పరారైన గాయత్రి చిల్లీస్‌ ట్రేడర్స్‌ యజమానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజి సురేష్‌ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ దేశాయిపేట శివారు లక్ష్మీ టౌన్‌షిప్‌కు చెందిన లడే తిరుపతి.. గాయత్రి చిల్లీస్‌ ట్రేడర్స్‌ పేరుతో లైసెన్స్‌ తీసుకుని మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల 49 మంది మిర్చి వ్యాపారుల నుంచి సుమారు రూ.2కోట్లపైగా మిర్చి కొనుగోలు చేసి బోర్డ్‌ తిప్పేసి పరారయ్యాడు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు లడే తిరుపతి, అతని భార్య మాధవి, కుమార్తె సిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితుడి భార్య, కుమార్తె పరారీలో ఉండగా.. శుక్రవారం ఉదయాన్నే వరంగల్‌ లక్ష్మీ టౌన్‌ షీప్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న తిరుపతిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.

నస్తూర్‌పల్లి నుంచి

‘రైతు భరోసా’ రెండో విడత

భూపాలపల్లి: కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరో సా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ఠాకూర్‌, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి జిల్లా అధికా రులతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి.. మేడిగడ్డ, కాళేశ్వరం సందర్శిస్తారని తెలిపా రు. అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారని తెలిపా రు. ఆయా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు అధికసంఖ్యలో తరలిరావాలని శ్రీ ధర్‌బాబు కోరారు. సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌ కుమార్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.

ధర్మ పరిరక్షణకు

కృషి చేయాలి

ఖిలా వరంగల్‌: హిందూవులు తమ ఐక్యతను చాటుతూ సనాతన హిందూ ధర్మ పరిక్షణకు కృషి చేయాలని భువన్వేరీ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి వరంగల్‌ కరీమాబాద్‌ రోడ్డులోని రామస్వామి గుడి ఆవరణలో ఓరుగల్లు హిందూ సమ్మేళన సమితి, కరీమాబాద్‌ శాఖ అధ్యక్షుడు కుసుమ దయాకర్‌, కార్యదర్శి బాల్నె అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్‌ అధ్యక్షతన హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిఽథి గా స్వామిజీ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కాచం రమేశ్‌జీ, డాక్టర్‌ సునిత రాంమోహన్‌ రెడ్డి, కార్పొరేటర్లు అరుణ, పోశాల పద్మ, పల్లం పద్మ, నాగరాజు, దీన్‌దయాళ్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement