హన్మకొండ కల్చరల్: ఈ నెల 19 ఆదివారం నుంచి శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, 30వ తేదీ గురువారం వరకు జరిగే కల్యాణ బ్రహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వరంగల్ జోన్ దేవాదాయశాఖ డీసీ, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఒక్కోక్కరోజు వివిధ కులసంఘాల వారు అమ్మవారి సేవలలో పాల్గొనడానికి ముందుకు వచ్చారని ఆ రోజున వారి నిర్వహణలోనే పూజాకార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనదల్చిన భక్తులు రూ.516 చెల్లించి రశీదు పొందాలని వారికి ప్రసాదం, అక్షింతలు, శేషవస్త్రాలు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఆలయ పరిశీలకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుడా చైర్మన్కు ఆహ్వానం
నయీంనగర్: భద్రకాళి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రధాన అర్చకులు శేషు, ఈఓ సునీత హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డికి బుధవారం ఆహ్వానపత్రిక అందించారు.
విజయవంతం చేయాలి: ఆలయ ఈఓ రామల సునీత
ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ


