న్యూస్రీల్
మ్యాపింగ్ రూపకల్పనలో నిమగ్నమైన అధికారులు
సెన్సస్ కోసం 150 నుంచి 200 నివాసాలతో కూడిన మ్యాపింగ్ తయారు చేస్తున్నారు. 750 నుంచి 800 మంది వరకు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్నే హౌస్ లిస్టింగ్ బ్లాక్(హెచ్ఎల్బీ)గా వ్యవహరిస్తారు. హెచ్ఎల్బీల మ్యాపింగ్లో స్లమ్స్ను సాధారణ కాలనీలతో కలపవద్దని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. సెన్సస్ ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించేందు కు తోడ్పడనుంది. ఈ ప్రక్రియ డివిజన్ల పునర్విభజనకు ఎంతగానో ఉపయోగపడనుంది.
26 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్
మే 10 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన, నమోదు
గడువులోగా పూర్తి చేసేందుకు
యంత్రాంగం కసరత్తు
వరంగల్ అర్బన్:
గ్రేటర్ వరంగల్లో జనగణన (సెన్సస్) మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెన్సస్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో బల్దియా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు, సిబ్బంది మ్యాపింగ్ తయారీలో నిమగ్నమయ్యారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
స్వచ్ఛంద నమోదుకు అవకాశం
జనగణన పదేళ్లకోసారి జరగాల్సి ఉంటుంది. 2011లో జరిగిన ఈ కార్యక్రమం 2021లో చేపట్టాల్సి ఉండేది. కానీ, 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల మొదలుపెట్టారు. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేసేవారు. ఈ దఫా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్యుమరేటర్లకంటే ముందుగా ప్రజలు స్వచ్ఛందంగానే సంబంధిత పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సదరు పోర్టల్ ఈనెల 26 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మే 9 వరకు ప్రజలు స్వచ్ఛందంగా నివాస వివరాలు, ఇంటి చిరునామాతో కుటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం జూన్ 12 వరకు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారి వివరాలు ధ్రువీకరిస్తారు. లేని వారి వివరాలు నమోదు చేస్తారు.
ప్రిన్సిపల్ చార్జ్ ఆఫీసర్గా
ఇన్చార్జ్ కమిషనర్
జనగణనకు ప్రిన్సిపల్ చార్జ్ ఆఫీసర్గా బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. కాశి బుగ్గ సర్కిల్కు డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, కా జీపేట సర్కిల్కు బిర్రు శ్రీనివాస్, వీరికి తోడు సిటీ ప్లా న ర్ రవీందర్, టెక్నికల్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తారు.
18 నుంచి ఎన్యుమరేటర్లకు శిక్షణ
ఈనెల 18 నుంచి మే 5 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడు విభాగాలుగా వర్గీకరించి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 12తో ఈ సంవత్సరానికి సంబంధించి ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాపులేషన్ సెన్సస్ ప్రారంభం కానుంది. ఈప్రక్రియ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేందుకు సుమారు 1,600 మందికిపైగా ఎన్యుమరేటర్లు అవసరం. ప్రభుత్వ విభాగాల నుంచి తీసుకోనున్నారు. 4–6 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమిస్తారు.


