కాజీపేట అర్బన్ : హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించి విజయభేరి మోగించారు. ఎంపీసీ సెకండియర్లో ఎన్.ధృతిరెడ్డి 994, కె.సాయినందిని 990, కె.యశస్విని 987, కె.మానస 985, ఎస్.జీవిక 984, బైపీసీలో పి.షన్మూఖి ప్రియా 980, ఎంపీసీ ఫస్టియర్లో ఎస్.చక్రిత 456, జి.ప్రహర్షిత 454, బైపీసీలో వి.మానస 433, బి.హర్షిత 430 మార్కులు సాధించారు. వీరిని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు ఏ.జితేందర్రెడ్డి, ఎన్.వెంకట్రెడ్డి అభినందించారు.
తిరుపతి కుటుంబానికి రూ.1,04,203 అందజేత
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన కాంటింజెంట్ వర్కర్ తిరుపతి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం బాధిత కుటుంబానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ అప్పయ్య చేతుల మీదుగా రూ. 1,04,203 మొత్తం అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తిరుపతి అంకితభావంతో విధులు నిర్వర్తించేవారన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు.
దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ
ఖిలా వరంగల్ : వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం వరంగల్ మిల్స్కాలనీ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ రమేశ్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ గాంధీనగర్కు చెందిన పగిండ్ల సురేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మంత్రాలు చేయడంతోనే మృతి చెందిందని ఆవేదనతో తిట్టాడు. అయితే తమనే తిట్టాడని రాయలమ్మ అనే మహిళ భావించింది. గత నెల మార్చి 17న కల్యాణ్, జగన్, నరేందర్ అనే వ్యక్తుల వద్దకు చేరుకుంది. సురేశ్పై దాడి చేస్తే రూ.5వేలు సుపారీ ఇస్తానని ఒప్పందం చేసుకుంది. దీంతో వారు ఒప్పుకుని మార్చి 17న కల్యాణ్, జగన్, నరేందర్.. బైక్పై సురేశ్ను ఎక్కించుకుని కోటిలింగాల గుడి సమీప ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం చనిపోయాడని భావించి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కల్యాణ్ తన అమ్మ, అన్నకు వివరించగా.. వారు శివతోపాటు జశ్వంత్ అనే ఆటో డ్రైవర్ సాయంతో క్షతగాత్రుడు సురేశ్ను ఆటోలో తీసుకుని అతడి ఇంటి సమీపంలో పడేసి పరారయ్యారు. స్థానికులు చూసి సురేశ్ను ఎంజీఎం తరలించారు. క్షతగాత్రుడి సోదరి గంటి జ్యోతి మిల్స్కాలనీ పీఎస్లో ఫిర్యాదు చేయగా.. 24గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. ఎనిమిది మందిలో ముగ్గురు పరారీలో ఉండగా.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజ్కుమార్, శివ, పసునూరి సరిత పరారీలో ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన కల్యాణ్, రాయలమ్మ, జగన్నాయక్, నరేందర్, యశ్వంత్ పట్టుపడ్డారు. ఎస్సైలు నరేశ్, మహేష్, శ్రవణ్కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.


