● హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వచ్చిన ప్రతీ వినతిపై నిర్లక్ష్యం లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను ఓపికగా విన్న కలెక్టర్.. సమస్యల పరి ష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 138 అర్జీలు అందినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కన్నం నారాయణతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్లో ఫిర్యాదు.. కలెక్టర్ పరిశీలన..
హన్మకొండ: గ్రీవెన్స్లో 56వ డివిజన్ గాయత్రి కాలనీ నివాసితులు తమ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రాత్రి సంబంధిత ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.కాలనీవాసులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పన్ను వసూళ్ల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు.
సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 165 దరఖాస్తులు రాగా అందులో రెవెన్యూ 71, జీడబ్ల్యూఎంసీకి సంబంధించి 23, ఇతర శాఖలకు సంబంధించినవి 71 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ, సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు ఉన్నారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
నగరంలోని ఐఎంఏ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ సత్యశారద ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 64 మంది యాత్రికులు ఫిట్నెస్ పొందగా, వారిలో 58 మంది యాత్రికులకు టీకా వేశారు.


