మరోసారి ఎగిరేది గులాబీ జెండే..
జనగామ : రాష్ట్రంలో బీఆర్ఎస్(గులాబీ) జెండా మరోసారి ఎగరబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి తో కలిసి మాట్లాడారు. ఉద్యమంలో పాత్రలేని నేతలు పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బిడ్డకు ఎంపీ అనేక పదవులు అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తట్టా, పార పారేసి సీఎం రేవంత్రెడ్డి పంచన చేరారని పేరు ప్రస్తావించకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పది మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా, కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. సర్పంచ్ల విజయం పార్టీ కార్యకర్తల శ్రమతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రభుత్వం పోలీసులను పంపించి వేధిస్తోందన్నారు. రేవంత్రెడ్డి రూ.ఆరువేల కోట్ల ఒప్పందాల్లో రాహుల్కు మూటలు సర్దే పనికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో 48 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. యాప్లో మాత్రమే యూరియా కనిపిస్తోంది.. షాపులో ఉండడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తొండలు వదిలే సమయం దగ్గరలోనే ఉందన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్ను సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రజలు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు.
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిచ్చి కూతలు మానుకోవాలని ఎమ్మెల్యే జనగామ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కడియానికి షాక్ ఇచ్చేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనగామ, స్టేషన్ఘన్ పూర్ పురపాలికల్లో గులాబీ పార్టీ గెలువబోతోందన్నారు.
● పార్టీలు మార్చే కడియం శ్రీహరి చరిత్రను త్వరలోనే బట్టబయలు చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వంద పడకల ఆస్పత్రి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ హయాంలో ఆవిర్భవించిందన్నారు. ఇవి రాకుండా అడ్డుపడిన మొదటి వ్యక్తి కడియం అన్నారు. రేవంత్రెడ్డి సీఎంగా ఏడాది ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
● కాంగ్రెస్ నాయకుల్లారా.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను విమర్శిస్తారా అని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తె లంగాణ లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు సమైక్య వాదుల చెప్పులు మోసే పరిస్థితి వచ్చేదన్నారు.
జనగామ గులాబీ మయం..
కేటీఆర్ రాకతో జనగామ గులాబీ మయంగా మారింది. పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్కు స్వాగతం పలుకగా, వేలాది మందితో భారీ ర్యాలీగా జనగామ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నెహ్రూపార్కు మీదుగా భ్రమరాంబ కన్వెన్షన్కు చేరుకున్నారు.
కడియం శ్రీహరి ద్రోహం చేశారు
కాంగ్రెస్ అంటే గుండా రాజ్యం
యూరియా యాప్లో ఉంది.. షాపులో లేదు
సీఎంకు తొండలు వదులుదాం
సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్


