
‘ఇందిరమ్మ’ జాబితా క్రాస్ చెక్
హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. ఎంపిక చేసిన జాబితాను మళ్లీ క్రాస్ చెక్ చేస్తున్నారు. జాబితాలో ఉన్న లబ్ధిదారులు అర్హులా? కదా? అని నిర్ధారించడానికి మళ్లీ అధికారులు ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రత్యేకాధికారులు సర్వేలో నిమగ్నమయ్యారు.
ఇందిరమ్మ కమిటీలదే బాధ్యత ..
లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించారు. ఆయా గ్రామాలు, డివిజన్ల్లో ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను స్థానిక ఎమ్మెల్యేకు అప్పగించగా, అదే జాబితాను అధికారులకు అందజేశారు. అనర్హులుగా ఉన్నట్లు తేలితే వారి పేర్లను తొలగిస్తున్నట్లు సమాచారం.
600 ఎస్ఎఫ్టీ దాటొద్దు
సొంత స్థలం ఉండి 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకున్న వారు పేదవాడు కాదని వారికి పథకం వర్తించదని అధికారులు చెబుతున్నారు.దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న పెంబర్తిలో ఓ లబ్ధిదారుడు 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీంతో అతడు అనర్హుడని గుర్తించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనర్హులకు పథకం వర్తింపజేస్తే ఆ బాధ్యత స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓదేనని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
కమిటీలదే ఎంపిక బాధ్యత
600 చదరపు అడుగులు దాటితే..
అనర్హులు
నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అధికారులే బాధ్యులు
మూడు కేటగిరీలుగా దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్–1 కేటగిరిలో, స్థలంలో గుడిసె, పూరి గుడిసె, మట్టి ఇళ్లు, రేకుల ఇళ్లున్న వారిని సైతం ఎల్–1 కేటగిరిగా విభజించారు. సొంతస్థలం లేని వారిని ఎల్–2 కేటగిరిలో, సొంత ఇళ్లు ఉండి, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–3 కేటగిరిలో పొందుపరిచారు. ఇక్కడ ఎల్–1 కేటగిరిలో ఉన్నవారికే ప్రాధాన్యత కల్పించారు.

‘ఇందిరమ్మ’ జాబితా క్రాస్ చెక్