అతివేగంతో అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

అతివేగంతో అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Jun 29 2023 1:20 AM | Updated on Jun 29 2023 12:42 PM

సాయికుమార్‌ మృతదేహం  - Sakshi

సాయికుమార్‌ మృతదేహం

నర్సంపేట రూరల్‌ : చివరి సంవత్సరం.. కళాశాలకు చివరి రోజు.. దీంతో ఓ యువకుడు ఉదయమే కాలేజీకి చేరుకున్నాడు. అక్కడ స్నేహితులతో ఆనందంగా గడిపాడు. స్మృతులను నెమరువేసుకుని ఎంజాయ్‌ చేశాడు. ఫొటోలు దిగిన అనంతరం మిత్రులకు వీడ్కోలు చెప్పాడు. మధ్యాహ్నం వ్యక్తిగత పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై వరంగల్‌ వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డుతోపాటు కల్వర్టును ఢీకొని కాల్వలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నర్సంపేట మండలంలోని లక్నెపల్లి శివారులో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన చింతల చెరువు కుంభం సైదులు, ఉమాదేవి దంపతులకు కుమారుడు సాయికిశోర్‌ (22), కూతురు వైష్ణవి ఉన్నారు. సాయికిశోర్‌ వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని బాలాజీ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. లక్నెపల్లిలో కిరాయికి ఉంటూ రోజూ తన బైక్‌పై కళాశాలకు వెళ్లి వస్తాడు. ఈ క్రమంలో కళాశాలలో చివరి రోజు కావడంతో వైవా పూర్తి చేసుకుని స్నేహితులతో ఆనందంగా గడిపాడు. అనంతరం వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై వరంగల్‌కు వెళ్లి వస్తున్నాడు.

అతివేగంగా వస్తూ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డుతోపాటు కల్వర్టు ఢీకొని కాల్వలో పడ్డాడు. గమనించిన స్థానికులు 108లో నర్సంపేటకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న నర్సంపేట రూరల్‌ ఎస్సై సురేశ్‌ నాయక్‌ మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement