ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి
తాడేపల్లి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజియన్ కో ఆర్డినేటర్, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్లతో సమావేశయ్యారు. వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల్లో సత్తా చాటాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతినియోజకవర్గంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతోపాటు, కూటమి ప్రభుత్వం వైఫల్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పారు.
ఆడపిల్లలను రక్షిద్దాం లఘుచిత్రాల పోటీలు
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 30న గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘ఆడపిల్లలను రక్షిద్దాం’ అనే అంశంపై లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి కింద రూ.30వేలు, రెండవ బహుమతి కింద రూ.20వేలు, మూడో బహుమతి కింద రూ.10వేలు అందజేస్తారని తెలిపారు. బహుమతులను ఈనెల అక్టోబరు 11న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విజేతలకు అందజేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో కేవలం రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, అవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేబ్రోలు మాత్రమేనన్నారు. ఈవిషయంపై ఆర్జేడీకి సర్క్యూలర్ పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.
చేపల చెరువులో పడి వ్యక్తి మృతి
నందివాడ: మండలంలోని ఇలపర్రు గ్రామంలో ఉన్న చేపల చెరువులో పడవపై స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామానికి చెందిన పొన్నూరి పోతురాజు (30), లక్ష్మీతిరుపతమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఇలపర్రు గ్రామంలోని పెనుమత్స రామరాజుకు చెందిన చేపల చెరువుల వద్ద నాలుగు రోజుల క్రితం మేత కట్టే పనికి వచ్చారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో చెరువులోకి పడవపై వెళ్లి మేతకట్టిన అనంతరం స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారీ నీటిలో పడిపోయాడు. నీటమునిగి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీతిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందివాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు
పట్నంబజారు: పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పెదకాకానికి చెందిన బాలిక పదో తరగతి చది ఇంట్లో ఉంటుంది. గుంటూరు నగరంలోని అమ్మమ్మ ఉంటున్న అంబేడ్కర్ నగర్కు వచ్చి వెళుతుండేది. అదే ప్రాంతానికి చెందిన కాండ్రుగుంట శివధర్మ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని యువతి కోరగా, తాను చేసుకోనంటూ బెదిరింపులకు గురిచేస్తున్న శివధర్మపై యువతి ఫిర్యాదు మేరకు లైంగిక దాడి పాల్పడినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విదేశీ విద్యార్థులతో ముఖాముఖి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలోని వికాస భవన్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్లానింగ్ టు పర్సు యువర్ మాస్టర్స్ ఆర్పీహెచ్డీ అబ్రాడ్ అనే అంశంపై విదేశీ విద్యాలయాల ప్రతినిధులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన ఏడు యుఎస్ఏ, ఒకటి నెదర్లాండ్స్ దేశానికి సంబంధించి యూనివర్సిటీల ప్రతినిధులతో వీసీ ఆచార్య కంచర్ల గంగాధరరావు, రెక్టర్ ఆచార్య రామినేని శివరాం ప్రసాద్, రిజిస్టర్ ఆచార్య జి సింహాచలం చర్చించి వారిని స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సన్మానించారు.


