లీప్ యాప్ను తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) 3.1ను ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలుపుకుని 1048 ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సుమారు లక్షా 80 వేల మంది పేరెంట్స్ పాల్గొననున్నారన్నారు. ఇదొక మెగా ఈవెంట్గా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:45 గంటలకు ముగుస్తుందని తెలిపారు. ఇందులో తల్లిదండ్రులతో ఒక్కో ఉపాధ్యాయుడు పరస్పరం మాట్లాడి, విద్యార్థి చదువు వివరాలు చర్చిస్తారన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఆంధ్ర ప్రదేశ్ (లీప్) యాప్ ను తల్లిదండ్రులు అందరూ డౌన్ లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తారన్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల తమ పిల్లల విద్యా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి ఏదో ఒక పాఠశాలలో తప్పక హాజరు కావాల్సి ఉందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లల చదువు వివరాలతోపాటు తల్లిదండ్రులకు మరింత బాధ్యత పెరుగుతుందని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం బాషా పాల్గొన్నారు.


