30న చలో విజయవాడ జయప్రదం చేయండి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు
లక్ష్మీపురం: సాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30వ తేదీన చలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అధ్యక్షత వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ గుంటూరు హై లెవెల్ చానల్ లో పూడికను తీయాలని, దాంతో పాటు ముళ్ళుకంపను తొలగించి చానల్ కట్టలను బలోపేతానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జల్లవాగులో పూడిక తీయకపోవటం వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాల్లో పంటలు ముంపుగురై రైతాంగం నష్టపోతున్నారని ఈ వాగును ప్రక్షాళన చేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ
అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల కాలవల నిర్మాణం తక్షణమే చేపట్టాలని, పంట కాలవలలో ఉన్న పూడిక, గురపు డెక్క, తూడికాడ తొలగించి సాగునీటి వ్యవస్థను మేరుగు మర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయకపోవడం చాలా దారుణమన్నారు. సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌలు రైతుల కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం నాయకులు కోటా మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు పచ్చల సాంబశివరావు, ముప్పాల సాంబశివ, సూర్యనారాయణ, కూసం నాగిరెడ్డి, కొల్లి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.


