గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో టాటాఏసీ వాహనం.. కారు ఢీకొని 8 మందికి గాయాలైన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. మేడికొండూరుకు చెందిన టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణ తన క్లీనర్ లింగాల నరసింహారావుతో కలసి టాటాఏసీ వాహనంలో విజయవాడ వెళుతున్నారు. ఈ క్రమంలో టాటాఏసీ బుడంపాడు సమీపంలోని సత్యసాయిబాబా ట్రస్ట్ ప్రాంతంలో ఎన్హెచ్ 16 వైవేలో వెళుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని గాల్లోకి లేచి అవతలవైపు రోడ్డుపై పడింది. ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ తీవ్రగాయాలపాలవ్వగా, అదే సమయంలో విజయవాడ నుంచి బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన షేక్ జాఫర్సాదిక్, అతడి భార్య గౌషార్సుల్తాన్, కుమారుడు నవాజ్షరీఫ్, కుమార్తె వజీహాసుల్తానా, బావ సయ్యద్ మహబూబ్హుస్సేన్, షేక్ మామానాజిన్ ఆరుగురు కారులో వేటపాలెంకు వెళుతున్నారు. అదేసమయంలో రోడ్డు అవతలవైపునుంచి టాటాఏసీ వాహనం కారు ముందు సడన్గా పడటంతో కారు టాటాఏసీ వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారులోని ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళుతున్న ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైన వాహనాలను ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇరువురు యువకులకు స్వల్ప గాయాలు కాగా వారు తమ వాహనం తీసుకుని వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రమాదానికి గురైన కారులోని ఆరుగురిని, టాటాఏసీలోని ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదంలేదని టాటాఏసీ డ్రైవర్ శివరామకృష్ణకు తీవ్రగాయాలవ్వటం వలన పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గాయాలపాలైన షేక్ జాఫర్సాధిక్,
అతని భార్య గౌషార్సుల్తానా
టాటాఏసీ డ్రైవర్
శివరామకృష్ణ..


