ముఖ్య ఎన్నికల అధికారికి విజ్ఞప్తి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్(సర్)నైనా ఓటర్ లిస్టులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల ముఖ్య అధికారి వివేక్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అర్హత గల ఏ ఒక్క రాష్ట్ర పౌరుడిని ఓటు హక్కు కోల్పోకుండా... చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటర్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారి ఓట్లను గుర్తించి నిస్పక్షపాతంగా తొలగించాలన్నారు. అందులో ఎలాంటి లొసుగులు ఉండకుండా చూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ,రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి.సేవకుమార్ విజ్ఞప్తి చేశారు. ఆధార కార్డుకు సిటిజన్ షిప్ విషయంలో ప్రాధాన్యం లేక పోయినా చనిపోయిన వారి ఓట్లను, డూప్లికేట్ ఓట్లను, దేశం, రాష్ట్రం విడిచి వెళ్లిన వారి ఓట్లను తొలగించడం కోసం... సర్లో ఓటర్ లిస్టులను ప్రక్షాళన చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని కోరారు. సమావేశంలో బాపట్ల జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఆట్ల బాలాజీ రెడ్డి పాల్గొన్నారు.


