అదే మానవ జన్మకు సార్ధకత జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి
గుంటూరు లీగల్: తప్పిపోయిన పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ కోరారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ పిల్లలు తప్పిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. తల్లిదండ్రులు పిలల్ల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. గుడ్ టచ్, బాడ్ టచ్పై బాలికలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ిపిల్లలు తప్పిపోయిన, ఎక్కువ సమయం కనపడకపోయిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకోని పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అండగా ఉండి న్యాయం చేస్తుందని వివరించారు. ఎటువంటి న్యాయ సహాయం కొరకై న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ దుర్గా భవాని, డీసీపీఓ విజయ్కుమార్ పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: మనిషి మరణించిన సమాజానికి ఉపయోగపడితే జన్మకు పూర్తి స్థాయిలో సార్ధకత చేకూరుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘ అధ్యక్షుడు డాక్టర్ రమణ యశస్వి పేర్కొన్నారు. అఖిల భారత అవయవ శరీర దాతల సంఘ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్(స్పెక్ట్) జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని సోమవారం అరండల్ పేటలోని ఆర్య సమాజం ప్రాంగణంలో నిర్వహించారు. సమావేశానికి సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు మేడూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన మనదేశంలో మూఢ విశ్వాసాలు, అపోహలు తొలగి రక్త, నేత్ర, అవయవ, దేహ దానం ఒక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న అఖిలభారత శరీర అవయవదాతల సంఘ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేహ, అవయవదానాలపై సరళీకృత విధానాలు తీసుకురావాలని కోరారు. అఖిలభారత శరీర అవయవదాతల సంఘం, స్పెక్ట్ ఆర్గనైజేషన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని చైతన్యవంతులను చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా స్పెక్ట్ ప్రచార గోడ ప్రతులు ఆవిష్కరించిన అనంతరం ఇటీవల నేత్ర, అవయవ, శరీర దానాలు చేసిన వారి కుటుంబ సభ్యులను అతిథులు సత్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవకుమార్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, స్పెక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లూరి సదాశివరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.శివాజీ, కనపర్తి రాఘవరావు, రాధారాణి, ఆర్య సమాజం అధ్యక్షురాలు గుర్రం నిర్మలా దేవి, డాక్టర్ పంచుమర్తి కల్పన, బందా రవీంద్రనాథ్, నిర్మల పాల్గొన్నారు.


