కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది జూలై 20వ తేదీ నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం జీజీహెచ్ వైపు జరుగుతున్న శంకర్విలాస్ ఆర్వోబీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పెమ్మసాని మాట్లాడుతూ వంతెనకు రెండువైపులా కలిపి అవసరమైన 38 పునాదులకుగానూ ఇప్పటి వరకు 30 పునాదులకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మరో రెండు పునాదుల పనులతోపాటు త్వరలో మిగిలిన ఆరు పునాదుల పనులు సైతం ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రస్తుతం విధుల్లో నిమగ్నమైన వర్కర్లకు అదనంగా మరో వంద మందిని పనుల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఏడాది జూలై 20 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ విలాస్ ఆర్వోబీని పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ మయూర్ అశోక్, అధికారులు ఉన్నారు.


