ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నంద్యాలకు చెందిన భక్తులు సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని కానుకగా సమర్పించారు. నంద్యాల నందిపల్లికి చెందిన వి.ఉదయ భాస్కర్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి సుమారు రూ.2 లక్షలు వెచ్చించి 22 గ్రాముల బంగారం, పచ్చ రాళ్లతో తయారు చేయించిన హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్, అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


