గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని, ప్రతీ గృహం యొక్క నిర్మాణ పనులు దశ మారాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణ ఇంజనీర్లు, గుత్తేదారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుత్తేదారులు వారికి గతంలో జరిగిన చెల్లింపుల మేరకు పనులు తక్షణం పూర్తి చేసి తదుపరి దశకు తీసుకురావాలన్నారు.
26న సెన్సస్ 5 కే రన్
జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5 కె రన్‘ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. సెన్సస్ 5 కె రన్ ఆదివారం ఉదయం 6 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభం అవుతుందని తెలిపారు. స్వీయ గణన సదుపాయంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములైన వాస్తవ వివరాలు పొందుపరచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన రెండు దశల్లో నిర్వహిస్తారన్నారు. మొదటి దశగా ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహిస్తారని చెప్పారు. ఇందులో ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరుగుతుందని అన్నారు. 5 కే రన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.


