రేపల్లె: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్కుమార్ పరారైన ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీ వరప్రసాద్ శుక్రవారం రేపల్లె సబ్జైలును సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ సబ్జైలులోని రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇప్పటికే సస్పెండ్కు గురైన జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సిబ్బందిని విడివిడిగా విచారించారు. పరారీ వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఐజీ వరప్రసాద్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనే ఇతర జైలు నుంచి తప్పించుకున్న చరిత్ర ఉన్న అజిత్కుమార్ను రేపల్లె సబ్జైలుకు తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. అయినప్పటికీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అతనికి ఇక్కడ రిమాండ్ ప్రవేశం కల్పించడంపై విచారణ చేస్తున్నామన్నారు. ఖైదీ అజిత్కుమార్ అధికారులకు రూ. లక్షల్లో లంచం ఇచ్చాడన్న ఆరోపణలను అవాస్తవమన్నారు. అయితే విచారణలో కొంతమంది సిబ్బందికి కొంత మేర నగదు అందినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు.


