గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శుక్రవారం కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు.
– సమావేశంలో నూతన ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విస్తరణ, పరిశోధన శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ, విశ్వవిద్యాలయం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు స్థాయిలో క్షేత్ర పరిశీలనలు, విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. 2026–27 సంవత్సరం వ్యవసాయ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు అన్ని అనుబంధ శాఖలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
● పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయంలో మితిమీరిన రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు.
● విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వివిధ విస్తరణ కార్యక్రమాలను రూపొందించాలన్నారు.
● పత్తిపంటలో గులాబి రంగు పురుగుల యాజమాన్యం, అపరాల పంటల్లో సమగ్ర యాజమాన్యం పద్ధతులు, వరిలో కలుపు యాజమాన్యం, పశుపెంపకం, వంటి ప్రచురణలను విడుదల చేశారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించారు.
కార్యక్రమంలో ఏపీఎస్సీఆర్ డైరెక్టర్ డాక్టర్ వై సతీష్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యవసాయ అధికారులు, ఆర్ఈఏసీ సభ్యులు, అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు.


